ముద్ర ప్రతినిధి, నాగర్కర్నూల్ :
నాగర్కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ గురువారం ఉచిత కంటి చికిత్స మరియు కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించనున్నట్లు ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు.
ఈ శిబిరం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనంలో గది నెంబర్–102లో, ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
శిబిరంలో రోగులకు ప్రత్యేక కంటి పరీక్షలు, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల అనంతరం క్యాటరాక్ట్ (కంటి పొర) సమస్య ఉన్న వారికి మహబూబ్నగర్ జిల్లా ఏనుగొండలోని లయన్ రామ్ రెడ్డి కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోగులను ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఏనుగొండకు తరలించే ఏర్పాట్లు కూడా చేసినట్లు వెల్లడించారు.
శిబిరానికి వచ్చే రోగులు ముందుగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకొని వాటి రిపోర్టులను వెంట తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ లేదా ఏదైనా గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీతో పాటు ఫోన్ నెంబర్ తీసుకురావాలని తెలిపారు.
ఆపరేషన్ అనంతరం రోగులను ఈ నెల 30వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు పాత కలెక్టరేట్ కార్యాలయం వద్ద దింపనున్నట్లు పేర్కొన్నారు.
వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు : 9440876556
7386940480