-ధన్వాడ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని మార్చండి
ధాన్యం విక్రయించిన సమయంలో కోత విధించిన అంశంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలి
ముద్ర, నారాయణ పేట:
మరికల్ గురుకుల పాఠశాలలో రూ.43 లక్షలతో చేపట్టిన వివిధ మరమ్మతు పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఆదేశించారు. మంగళ వారం కలెక్టర్ మరికల్ గురుకుల పాఠశాల/కళాశాలను సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న శానిటేషన్, ఎలక్ట్రికల్, ఇతర నిర్మాణ పనులను పరిశీలించారు. పాఠశాలల్లో కొనసాగుతున్న మరమ్మతు పనులన్నీ వారం రోజుల్లో పూర్తి కావాలని ఆమె స్పష్టం చేశారు.
ధన్వాడ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని మార్చండి
ధన్వాడ మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహం పూర్తిగా శిథిలావస్థ కు చేరిందని, వసతి గృహాన్ని అక్కడి నుంచి మార్చి వేరే అనువైన భవనంలోకి మార్చాలని కలెక్టర్ ఆదేశించారు. వసతి గృహం లోపల పై కప్పు పెచ్చులూడి ఉండటం, వంటగది పై కప్పు కూడా శిథిలావస్థకు చేరటం, వసతి గృహా మరుగు దొడ్లు, స్నానపు గదుల కు తలుపులు లేకపోవడాన్ని చూసిన కలెక్టర్ మరమ్మతులు చేయించినా లాభం లేదని, భవనం పూర్తిగా కూలిపోయే పరిస్థితి ఉందని, ఇక వచ్చే నెల పాఠశాలలు పునః ప్రారంభం వరకు ధన్వాడ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని వేరే చోటికి, మరికల్, లేదా నారాయణ పేట జిల్లా కేంద్రంలో విద్యార్థులకు అన్ని వసతి,సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ,లేదా ప్రైవేటు భవనంలోకి మార్చాలని సూచించారు. ప్రస్తుతానికి ధన్వాడ ఎస్సీ బాలుర వసతి గృహం కోసం ఏదైనా అద్దె భవనాన్ని చూసి, మార్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ధన్వాడ పర్యటనకు వచ్చిన కలెక్టర్ కు కొంత మంది రైతులు కలసి తాము కొనుగోలు కేంద్రంలో విక్రయించిన ధ్యానం లో మరికల్ వేంకటేశ్వర రైస్ మిల్లు యజమాని కోత విధించినట్లు రైతులు కలెక్టర్ తో మొర పెట్టుకున్నారు. స్పందించిన కలెక్టర్ వెంటనే సివిల్ సప్లై అధికారి బాల్ రాజ్ కు ఫోన్ చేసి ధన్వాడ రైతులకు వెంకటేశ్వర రైస్ మిల్లు యజమాని విధించిన కోత పై విచారణ చేసి సాయంత్రం వరకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.