- జిల్లా న్యాయ సేవఅధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రజిని.
ముద్ర ప్రతినిధి, వనపర్తి : మహిళలకు ఉచిత న్యాయ సేవలు ఉన్నాయని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి రజని అన్నారు. బుధవారం వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం మండల కేంద్రంలో మహిళా మండల సమైక్య సభ్యులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యి మాట్లాడారు.గృహహింస నిరోధక చట్టం-2005 ప్రకారం మహిళలను గృహహింసకు గురిచేస్తే శిక్షలు అమలు అవుతాయని తెలియజేశారు. అలాగే గృహ హింసకు గురి అయిన మహిళలకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవలు అందిస్తామని తెలియజేశారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ గురించి వివరిస్తూ తల్లిదండ్రులను నిరాశ్రయులను చేస్తే సంతానంకు ఇచ్చిన ఆస్తిని మళ్లీ తల్లిదండ్రులకు అప్పగించే వెసులుబాటు ఉంటుందని తెలియజేశారు.నిరాశ్రయులుగా మారిన వృద్ధులకు సలహాలను సూచనలను ఇచ్చారు. చట్టాలను వివరించడంలో భాగంగా బాల్యవివాహాల చట్టం బాల కార్మికుల చట్టం గురించి తెలియజేశారు. ఉచిత న్యాయ సలహాల కొరకు 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు అని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జి ఉత్తరయ్య అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శ్రీదేవి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాసులు, మండల అధ్యక్షురాలు మల్లీశ్వరి, పారా లీగల్ వాలంటీర్ కల్పన పాల్గొన్నారు.
