- రాష్ట్రం ఏర్పాటై 11 ఏండ్లయినా హైదరాబాద్ లో అవే సమస్యలు.
- విశ్వ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ లేదు.
- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఏండ్ల నుంచి వేధిస్తున్న మ్యాన్ హోల్స్ సమస్య ఉంచి హైదరాబాద్ నగరవాసులకు విముక్తి ఎప్పుడు కలుగుతుందోనని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సిద్ధించి పదకొండేళ్లు అయినప్పటికీ రాష్ఠ్ర రాజధానిలో సమస్యలు అలానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లో డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉందని ఈటల సహనం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సాంకేతిక యుగంలో గొప్పగా విశ్వ నగరం అని చెప్పుకునే హైదరాబాద్లో కనీసం డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా లేదని విమర్శించారు. చాలా వేగంగా విస్తరిస్తున్న సీటీలో చాలా వరకు పైప్లైన్స్ లేవని, తాగునీటి కనెక్షన్స్ లేవని, ఒక వేళ నల్లా కనెక్షన్లు ఉన్నా కూడా నీళ్లు రాని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ, వాటర్ ప్రాబ్లమ్ చాలా తీవ్రంగా ఉందన్నారు. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఈ సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాకముందు హైదరాబాద్లో వరదలు వస్తే కార్లు కొట్టుకుపోవడం, మనుషులు మ్యాన్ హోల్స్ లో పడిపోవడం చూశామని గుర్తుకు చేశారు. ఇప్పుడు పదకొండు ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్లో ఆ సమస్యలు అలాగే ఉన్నాయని వ్యాఖ్యానించారు.