కూకట్ పల్లి, ముద్ర విలేకరి : నేటి యాంత్రిక జీవితంలో మనిషికి యోగాతోనే మంచి ఆరోగ్యం సాధ్యమని కూకట్ పల్లి స్వచ్ఛభారత్ అభియాన్ అధ్యక్షులు, బిజెపి సీనియర్ నాయకులు మాధవరం కాంతారావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన కూకట్ పల్లి యన్.కే.ఎన్.ఆర్ గార్డెన్స్ లో నిర్వహించనున్న యోగ వేడుకల స్థలాన్ని, మౌళిక సదుపాయాలను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి సంవత్సరం కూకట్ పల్లిలో స్వచ్ఛభారత్ అభియాన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రతి ఒక్కరు తమ దినచర్యలో యోగాను తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలన్నారు.ఈ యోగ వేడుకలకు నియోజకవర్గంలోని యువతీ యువకులతో పాటు ఆరోగ్యాభిలాషులందరు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యోగ గురువు శివుడు, శ్రీకర్ రావు, పద్మయ్య, పవన్, వినోద్ గౌడ్, రమేష్, బీచ్లో, బిజెవైయం వినోద్, అభియాన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.