ముద్ర ప్రతినిధి, భువనగిరి : 2000 శివలింగాలు, అనేక గురువులు కొలువైన మండలంలోని నాగిరెడ్డిపల్లి రమణేశ్వర మహాక్షేత్రంలో గురుపౌర్ణమి సందర్భంగా ఆదిగురు, పరమగురు, సద్గురు ఉపాసనలు గురువారం ఘనంగా నిర్వహించారు. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి మాట్లాడుతూ పరమహంస యోగానంద, ముక్తానంద, స్వామి రామాలు వారి గురువులపైన ఎంత భక్తిని ప్రదర్శించారో తెలుపుతూ అద్భుత అనుగ్రహ భాషణం చెప్పారు. గురుపౌర్ణమి రోజున జగద్గురు గౌతమ బుద్ధుని మొదటి ఉపదేశం చేసిన రోజుగా పరిగణిస్తారని చెప్పారు. గౌతమ బుద్ధుని వల్ల ఎంతో మంది రాజులు, సంసారులు, స్త్రీలు, పిల్లలు సన్యాసులుగా మారి ప్రపంచమంతా ఆధ్యాత్మికమయంగా మారిందని ఈ రోజున సజీవంగావున్న గురువును, గౌతమబుద్ధుడు, ఆదిగురువైన శివుడిని పూజించాలన్నారు.
పౌర్ణమిరోజున గురువు నుండి విశ్వశక్తి అందరిమీదకు వ్రసరిస్తుందని అందుకే గురువును దర్శించడం భారతీయ సంప్రదాయమన్నారు.రమణేశ్వరంలో గురువారం వేలాదిమంది శిష్యులతో పాటు సిద్ధగురు ధ్యానం నిర్వహంచారు. అనంతరం యోగిని భవాని, యోగిని శివాని మహర్షివారికి గురుపూజా కార్యక్రమం నిర్వహించారు. గురుపూజను చూసిన భక్తులు ఎంతో హర్షాన్ని వ్యక్తపరించారు.పాల్గొన భక్తులకు మంచి జరగాలని సిద్ధహవనం జరిగగా భక్తులందరూ హవనంలో పాల్గొన్నారు. ఆ తరువాత శివలింగాలకు అభిషేకం చేసిన భక్తులు సిద్ధగురు దర్శనం చేసుకొని అన్నదానంలో భోజనం చేశారు. గోశాలలోని గోవులకు ఆహార సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు పాల్గొన్నారు.
