అవినీతి జరగనప్పుడు భయపడ్డారెందుకూ..?
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఒడిశాలోని నైనీ బొగ్గు టెండర్ల విషయంలో అవినీతే జరగనప్పుడు.. వాటిని రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రశ్నించారు. సైట్ విజిట్ అమలు. నైనీ రద్దు అంటే.. అవినీతి జరిగినట్టే అన్నారు. నైనీని రద్దు చేసినట్లే మిగతా అన్ని టెండర్లను ఎందుకు రద్దు చేయలేదని నిలదీశారు. శనివారం మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు ఆయన ఎక్స్ వేదికగా కౌంటర్ చేశారు. మీరెన్ని సాకులు చెప్పినా మీ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగిందనే విషయం నిజం అన్నారు.. అందులో రేవంత్ రెడ్డి బామ్మర్ది రింగ్ మెన్ గా పాత్ర పోషించారని చెప్పారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై విచారణ జరగాలంటే సిట్టింగ్ జడ్జీ లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ మాత్రమే చేయగలవు అన్న ఉద్దేశ్యంతోనే లేఖ రాశానని హరీశ్ రావు చెప్పారు. మీరు నిజంగా రేవంత్ రెడ్డి, అతని బావమరిది కుంభకోణం మీద నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తానని హామీ ఇస్తే మీకూ లేఖ రాయడానికి సిద్దంగా ఉన్నానన్నారు. ఈ నెల 23న తాను బయటపెట్టిన మరో కుంభకోణం.. సోలార్ పవర్ స్కాం గురించి ఎందుకు ఒక్క మాట కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడలేదన్నారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా ‘బీటింగ్ అరౌండ్ ద బుష్’ లా ఏదో చెప్పి మసిబూసి మారేడు కాయ చేశారని విమర్శించారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను బీఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేస్తే నిజాలు అబద్దాలు అయిపోవనీ, జరిగిన స్కాములు, స్కీములుగా మారిపోవని వ్యాఖ్యానించారు. సైట్ విజిట్ నిబంధనను 2018లోనే మొదలైందని చెప్పి, దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉదాహరణలుగా చెప్పి ఏం చెప్పదలుచుకున్నారని ? హరీశ్ రావు ప్రశ్నించారు. అది తప్పు కాకుంటే నైనీ ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. ఇదే సైట్ విజిట్ విధానం సింగరేణిలో కూడా అమలు చేశామని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు సంతోషమన్నారు.