ముద్ర ప్రతినిధి,హనుమకొండ: కూచిపూడి నృత్య ప్రదర్శనలో హన్మకొండలోని గౌతమ్ నగర్ కాలనీకి చెందిన డాక్టర్ గుంటోజు హరిత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు.భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు.దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 4218 మంది నృత్య కళాకారులు పాల్గొనగా హరితకు నృత్య ప్రదర్శనలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దక్కింది. హరితాకృష్ణ కూచిపూడి నృత్య కళాక్షేత్రాన్ని హన్మకొండలో ఏర్పాటుచేసి ఎందరినో కళాకారులుగా ఆమె తీర్చిదిద్దారు.ఆమె దగ్గర శిక్షణ పొందిన చాలామంది తమ ప్రతిభను చాటుతూ గుర్తింపు పొందుతున్నారు.గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కడం పట్ల డాక్టర్ గుంటోజు హరిత సంతోషం వ్యక్తం చేశారు.భారతీయ నాట్య కళకు సేవ చేసే అవకాశం దక్కడం గర్వంగా ఉందన్నారు.ఈ సందర్భంగా హరితను ఆమె వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటుగా కాలనీవాసులు అభినందించారు.
