- ఐటీతో పాటు రక్షణరంగ సంస్థలకు హైదరాబాద్ నిలయం.
- బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టాక ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ అన్ని రకాల ఆవిష్కరణలకు వేదికగా నిలిచిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.ఐటీతో పాటు రక్షణరంగ సంస్థలకు హైదరాబాద్ నిలయంగా ఉందని, ఇక్కడ మానవ వనరుల కొరత లేదన్నారు. ఈ మేరకు హైదరాబాద్ హబ్సిగూడలో ఉన్న సీఎస్ఐఆర్లో ఏర్పాటు చేసిన స్టార్టప్ కాంక్లేవ్ను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్తో కలిసి ఎంపీ ఈటల సందర్శించారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల మాట్లాడుతూ..సీసీఎంబీ, ఐఐసీటీ ఎన్జీఆర్ఐ హైదరాబాద్లో ఉన్నాయని, కరోనాకు వ్యాక్సిన్ కూడా ఇక్కడే తయారైందని ఆయన తెలిపారు.ఒకప్పుడు భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉండేదని, ఇప్పడు 5వ ఆర్ధిక వ్యవస్థ స్థాయికి ఎదిగిందన్నారు.వరల్డ్ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు మీద ఆధారపడ్డ మన దేశం ఇప్పుడు సొంత కాళ్లమీద నిలబడిందన్నారు. అగ్రి, ఫార్మా రంగంలో ఒకప్పుడు అమెరికాలో వచ్చిన తరువత పదేళ్లకు కానీ మనదగ్గర ఆ మందులు వచ్చేవి కావని, కానీ ప్రపంచంలో ఎక్కడ ఏ మందు వచ్చినా వెంటనే మనం తయారు చేయగలుగుతున్నామని అన్నారు. ఐఐటీ, నిట్ మెడికల్ కాలేజీలు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉన్నాయో ఈ పదేళ్ళలో అన్ని ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.2024 -25, 2025 -26 బడ్జెట్ లో యువశక్తికి ఫైనాన్సియల్ సపోర్ట్ కోసం నాలుగు లక్షల కోట్లు బడ్జెట్ లో పెట్టి కొత్త ఆవిష్కర్తలకు వడ్డీలేకుండా, తిరిగి కట్టనవసరం లేకుండా రుణాలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. మానవశక్తి క్వాలిటీ, నాలెడ్జ్, క్రియేటివ్ గా ఉండాలని మోదీ ప్రయత్నమని, వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసేలా అనేక పథకాలు తీసుకువచ్చారని అన్నారు. కరోనా సమయంలో ప్రపంచం వణికి పోతుంటే ప్రజలకి భరోసా ఇచ్చి దేశాన్ని కాపాడిన బిడ్డ ప్రధాని మోడీ అని అన్నారు. కోట్ల రూపాయల ఖర్చు చేసి వాక్సిన్ ఉత్పత్తి చేయించారని, మొదటిసారి మనదేశంలో వాక్సిన్ ఎగుమతి చేసి మానవాళికి మందులు అందించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదేనని అన్నారు. భారతదేశం ఒకప్పుడు పేద దేశంగా ఉండేదని, ఇప్పుడు అమెరికాలాంటి దేశాలమీద ఆధారపడ్డ దేశమే కానీ ఈనాడు అన్ని రంగాల్లో స్వయంప్రతిపత్తి సాధించిన దేశం మనదని అన్నారు.హైదరాబాద్లోని అన్ని రైల్వే స్టేషన్లను రూ. 2500 కోట్లతో ప్రధాని మోడీ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.శాస్త్రవేత్తల మేదస్సు వికసిస్తే, దేశం గొప్పగా ఎదుగుతుందని నమ్మే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని ఎంపీ ఈటల అన్నారు.
