- దేశానికి యువపారిశ్రామికవేత్తల అవసరముంది.
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చెప్పారు.జూబ్లీహిల్స్ లో వికసిత్ భారత్ ఎంటర్ప్రిన్యూర్ నెట్ వర్క్ను ప్రారంభించిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు..పారిశ్రామికవేత్తల అభివృద్ధికి మార్గదర్శనం చేయడానికి వికసిత్ భారత్ ఎంటర్ ప్రెన్యూర్ సంస్థను హైదరాబాద్లో ప్రారంభించుకున్నామని చెప్పారు. లక్షలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించడ మే ఈ సంస్థ లక్ష్యమని ఆయన వివరించారు. యువత పరిశోధనలు చేయాలని, తమ సొంత వ్యాపారాలను ప్రారంభించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు.అలాంటి యువతకు సరైన మార్గదర్శనం అవసరమని ఆయన చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, అసెంబ్లీ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో భారీ స్థాయిలో పారిశ్రామికవేత్తలను తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.వ్యవసాయ రంగంలో సాంకేతికత ద్వారా మార్పులు తీసుకురావాలన్నారు. ప్రధాని మోదీ స్టార్టప్లను, యువ పారిశ్రామికవేత్తలను బలంగా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణాలు, ఇతర అనుమతుల క్లియరెన్స్ ప్రక్రియలను మరింత సులభతరం చేసిందన్నారు..విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత వ్యాపార రంగంలోకి ప్రవేశించి..దేశ అభివృద్ధిలో భాగ స్వాములు కావడానికి గొప్ప అవకాశం లభించనుందని ఆయన తెలిపారు.