ముద్ర, హైదరాబాద్ :

హైదరాబాద్ లోని పారడైజ్ జంక్షన్ నుంచి షామీర్ పేట ఓ ఆర్ ఆర్ జంక్షన్ వరకు 18.70 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు భూ సేకరణ ప్రక్రియలో పారదర్శకత, స్పష్టత ఉండేలా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి హామీ ఇఛ్చారు. ఎలివేటెడ్ కారిడార్ మార్గంలో ట్రాఫిక్ తగ్గింపు, కనెక్టివిటీ మెరుగుదల, పట్టణ మౌలిక సదుపాయాల బలోపేతానికి ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ ఎంతో అవసరం అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ సభ్యులతో భేటీ అయిన కలెక్టర్… భూ నిర్వాసితులతో మాట్లాడి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భూ నిర్వాసితులకు పరిహార విషయంలో ప్రభుత్వ విధివిధానాలు తెలియజేస్తామన్నా కలెక్టర్.. వారి అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకుని ముందుకువెళ్తామన్నారు. కాగా హైదరాబాద్ పరిధిలోని ప్యారడైజ్ నుంచి లోతుకుంట పరిధి వరకు 11.70 కిలోమీటర్ల భూ సేకరణకు సంబంధించి తిరుమలగిరి, కాకాగుడా, తోకట్ట, మచ్చ బొల్లారం గ్రామాలకు చెందిన భూ నిర్వాసితులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భూ సేకరణ అధికకారి అపర్ణ, హెచ్ఎండిఏ భూసేకరణ అధికారి అర్చన, ఆర్ అండ్ బి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.