లిఫ్ట్ నుంచి పడిపోతే పట్టించుకోని ఆస్పత్రి యాజమాన్యం, పోలీసులు, అధికారులు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు తప్పిన పెను ప్రమాదం
కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఘటన
1వ ఫ్లోర్ నుంచి కిందకు పడిపోయిన లిఫ్ట్
ఆస్పత్రి యాజమాన్యం, అధికారులపై తీవ్ర ఆగ్రహం
ముద్ర ప్రతినిధి,కరీంనగర్:
కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రిలో లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో మంత్రి ప్రయాణిస్తున్న లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో మంత్రి స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ, ఆస్పత్రి యాజమాన్యం, పోలీసులు, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమాచారం ప్రకారం, తన నియోజకవర్గానికి చెందిన ఓ రోగిని పరామర్శించేందుకు మంత్రి ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా మొదటి అంతస్తు నుంచి పై అంతస్తుకు వెళ్తుండగా, లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఘటనతో అక్కడ ఉన్నవారంతా భయాందోళనకు గురయ్యారు.
అయితే ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు ఆస్పత్రి సిబ్బంది, అధికారులు, పోలీసులు ఎవరూ స్పందించలేదని మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. “రాష్ట్రమంత్రికే ఇలాంటి పరిస్థితి ఉంటే, సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి” అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఆస్పత్రిలో భద్రతా ప్రమాణాలు పూర్తిగా విఫలమయ్యాయని, లిఫ్ట్ నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.