తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం
రాష్ట్రాల పునర్విభజన చట్టంలోనీ హామీలు అమలు పరచలేదు
-కేంద్రంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం
ముద్ర, నిజామాబాద్ / కోరుట్ల / మెటపల్లి /ఆర్ముర్ / భీంగల్ :
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ… తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.13 ఏండ్లు అధికారంలో ఉన్నా… రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను అమలు పరచలేక పోయారని ఆయన మండిపడ్డారు. నిధుల కేటాయింపుల్లో బీజేపీ పాలకుల మాటలకు చేతలకు ఎక్కడా పొంతన లేదన్నారు. నిజామాబాద్ లోకసభ నియోజకవర్గానికి ఇంచార్జీ గా వ్యహారిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్, కోరుట్ల, మెట్ పల్లి, భీంగల్,ఆర్ముర్ పురపాలక సంఘాల పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు.కేంద్రం అందించాల్సిన నిధులు మంజూరు చేయకపోవడంతోనే మున్సిపాలిటీల్లో జరగాల్సిన అభివృద్ధి జరగలేదని దుయ్యబట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలతో యావత్ తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నీరాజనాలు పలుకుటుందన్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని ప్రస్తుత పురపాలక సంఘం ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతం అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వైపు అనుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్న నేపద్యంలో బి.ఆర్.ఎస్, బి.జే. పిలకు వేసే ప్రతీ ఓటు నిరుపయోగంగా మారుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 పురపాలక సంఘాలతో పాటు నిజామాబాద్ తో సహా మిగిలిన ఆరు కార్పొరేషన్ లలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాజాగా నిర్వహించిన సర్వేల్లోనూ ఇవే ఫలితాలు ప్రస్ఫుటం అవుతున్నాయన్నారు. ఆయా పురపాలక సంఘాల పరిధిలో జరిగిన బహిరంగ సభల్లో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మినరల్ డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగ రావు, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జీ సునీల్ కుమార్ పాల్గొన్నారు.