ముద్ర,జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జిల్లాలో పదవ తరగతి పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని విశ్వభారతి టెక్నో పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణ తీరును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షా కేంద్రంలోని తరగతి గదులను సందర్శించి,విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును గమనించారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు,సెల్ ఫోన్లు అనుమతించరాదని అన్నారు. పరీక్ష సమయంలో బిట్ పేపర్ను సమయానికి అందజేయాలన్నారు. సమాధాన పత్రాలను తీసుకునే సమయంలో పరిశీలించాలని సూచించారు.విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థులు ఏదైనా అస్వస్థతకు గురైతే,వెంటనే వైద్య సేవలు అందించేందుకు ఓఆర్ఎస్,అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.పరీక్షలు ముగిసేంత వరకు అప్రమత్తతతో పకడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు.ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తి పారదర్శకంగా,పరీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత పరీక్ష కేంద్రం అధికారులు,తదితరులు పాల్గొన్నారు.