నిబంధనల మేరకు ఎన్నికల విధులు నిర్వహించాలి
-పారదర్శకంగా గుర్తులు కేటాయించాలి
-అధికారులు ఎన్నికల విధుల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి
-అధికారులకు ఆదేశాలు జారీచేసిన కలెక్టర్
ముద్ర: ఖమ్మం:-
రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల నిబంధన మేరకు ఎన్నికల విధులు నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా వైరాలోని తాహాసీల్దార్ కార్యాలయంలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల భి-ఫార్ములను, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తున్న గుర్తుల పక్రియను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ బీ-ఫామ్ లను పరిశీలించడంతోపాటు, గుర్తుల కేటాయింపు పట్ల పారదర్శకత పాటించాలని సూచించారు. ఎన్నికలలో పాల్గొనే అధికారులు అందరూ ఎన్నికల విధుల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా నోడల్ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లతో పాటు ఎన్నికలలో పాల్గొనే ఇతర సిబ్బంది క్షేత్రస్థాయిలో కలిసి సమన్వయతో పనిచేయాలని సూచించారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ప్రచార నిమిత్తము నిర్వహించే ర్యాలీలు, సమావేశాలకు ముందస్తుగా సంబంధిత అధికారుల నుండి అనుమతులు తీసుకోవాలని సౌండ్ సెట్టు, ప్రచార వాహనాలపై ప్రత్యేక అనుమతిని పొందాలని పేర్కొన్నారు. ప్రచారంలో పాల్గొనే పోటీ దారులు ఒకే రూటులో ప్రచారం కొనసాగించేందుకు అనుమతులు జారీ చేయవ ద్దని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు, మద్యం తరలిస్తే వాటిని పట్టుకొని చీజ్ చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో వైరా తాహాసీల్దార్ సురేంద్రబాబు మున్సిపల్ కమిషనర్ గురులింగం,ఎంపీడీవో తేజవత్ సక్రియ, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు,ఇతర అధికారులు పాల్గొన్నారు.