- జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్.
వికారాబాద్, ముద్ర విలేకరి : వైద్యులు, వైద్య సిబ్బంది సేవా దృక్పథంతో రోగులకు వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆసుపత్రి నిర్వహణ, మౌలిక వసతులు కల్పన తదితర అంశాలపై వైద్య అధికారులు, సిబ్బందితో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి నిర్వహణ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు. రోగులకు సౌకర్యవంతంగా ఉండేలా కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆహ్లాదంగా ఉండే విధంగా ఆవరణలో మంచి మొక్కలతో సుందరీకరణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రతి బ్లాక్ లో అందుబాటులో ఉండే వివిధ విభాగాల వైద్యుల వివరాలు ఉండే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారుల సూచించారు. చిన్న చిన్న సమస్యలతో రోగులకు అసౌకర్యం కల్పించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో కావలసిన సౌకర్యాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులలో బ్లాక్ ల వారీగా ప్రతి గదికి (సంఖ్య) నంబరింగ్ చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆస్పత్రుల్లో గోడల పైన పోస్టర్లను ప్రదర్శించకుండా ఆసుపత్రి ఆవరణ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారుల సూచించారు. పట్టణ కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న మార్చురీ (శవాల గది) ని విస్తీర్ణం చేసి మరమ్మత్తు పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ ఇఇ ఉమేష్ ను ఆదేశించారు. ఏరియా ఆసుపత్రికి పూర్తిగా శుభ్రం చేసి వైట్ వాష్ చేయించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రిలోని పరిసరాలను అదేవిధంగా వివిధ విభాగాల గదులను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ తో పాటు వైద్య కళాశాల ప్రిన్సిపల్ మల్లిఖార్జున్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామచందర్ రావు, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఆనంద్, వైద్య అధికారులు తదితరులు ఉన్నారు.
