ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
జూపల్లి కృష్ణారావు శనివారం పొలం బాట పట్టారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న ఆయన ఖరీఫ్ సీజన్ ముంగిట తన సొంత వ్యవసాయ క్షేత్రంలో రైతు అవతారమెత్తి సాగు పనులకు శ్రీకారం చుట్టారు.
స్వయంగా ట్రాక్టర్ను నడుపుతూ పొలాన్ని దున్ని, విత్తనాలు వేసేందుకు నేలను సిద్ధం చేశారు. రైతులతో కలిసి పనిచేస్తూ వ్యవసాయం పట్ల తన అనుబంధాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతుల కష్టాలు తనకు బాగా తెలుసని, రైతు దేశానికి వెన్నెముక అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజుగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
సేద్యాన్ని లాభసాటిగా మార్చేందుకు సమగ్ర వ్యవసాయ విధానాలను అమలు చేస్తున్నామని, రైతులకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని మంత్రి వివరించారు.