- భదాన్, దేవాదాయ, అసైన్డ్ కుంభకోణాలు వెలికితీస్తున్నాం
- సిరిసిల్లలో 2 వేల ఎకరాల భూమి కబ్జా
- రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ భూబాగోతం బయటకు వస్తుంది
- గవర్నర్ నుంచి రాగానే భూభారతి గెజిట్
- కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతున్నది
- జాతీయ పార్టీలకు రాని నిధులు ప్రాంతీయ పార్టీలకు ఎలా వచ్చాయి
- కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు దేశం తప్ప తెలంగాణ గురించి మాట్లాడలేదు
- తప్పు చేస్తే కేటీఆర్ తప్పించుకోలేడు
- మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిట్ చాట్
ముద్ర, తెలంగాణ బ్యూరో : గత ప్రభుత్వ పాలనలో భూదాన్,దేవాదాయ,అసైండ్ భూముల్లో జరిగిన కుంభకోణాల నిగ్గు తేల్చేలా ప్రభుత్వం నిర్వహించిన తలపెట్టిన ఫోరెన్సిక్ ఆడిటింగ్ ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన భూ బాగోతం ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత బయట పడుతుందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సియోల్ బాంబులు పేలడం మొదలు అవుతున్నాయని చెప్పారు. ఈ ప్రక్రియను సంక్రాంతి తర్వాత ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం మీడియాతో చిట్ చాట్ చేసిన పొంగులేటి.. కీలక అంశాలను ప్రస్తావించారు.
సిరిసిల్లలో 2వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిందనీ ఆ లెక్క కూడా తేలుస్తామన్నారు. ఏడాది తమ పాలనలో ప్రభుత్వం వేసిన కేసులు, విచారణ కమిషన్ లన్నీ బీఆర్ఎస్ నేతలు అడిగితేనే వేశామని పొంగులేటి చెప్పారు. కాళేశ్వరం, విద్యుత్, ఈ ఫార్ములా పై వారే విచారణ అడిగారన్నారు. ఇందులో కక్షపూరితంగా, ఉద్దేశపూరితంగా చేసింది ఏమీలేదన్నారు. వారు తమ పాలనలో తప్పులు చేశారు కాబట్టే ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయని చెప్పారు. జైలుకు వెళ్తేనే సిఎం అవుతాను అనుకుంటే కేటీఆర్ కంటే ముందు కవిత ఉన్నారు. ఇవేవీ లాభనష్టాల కోసం జరుగుతున్నవి కావన్న మంత్రి.. అరవింద్ కుమార్ నిజాలు చెప్తే అన్ని బయటకు వస్తాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఛత్తీస్ గడ్ నుంచి జరిపిన విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణంలో విద్యుత్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందిందన్న మంత్రి.. తదుపరి చర్యలపై న్యాయసలహాల తీసుకుంటున్నట్లు వివరించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై ఆ కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోందని చెప్పారు.
మరో కీలకమైన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా పూర్తి కాలేదనీ త్వరలోనే అన్ని అవినీతి, అక్రమాలపై ప్రభుత్వ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇటీవల అసెంబ్లీలో ధరణీ స్ధానంలో తీసుకువచ్చిన భుబారతి బిల్లు ఆమోదం కోసం గవర్నర్ వద్ద ఉందన్న మంత్రి..గవర్నర్ నుంచి అనుమతి రాగానే గెజిట్ విడుదల చేస్తామన్నారు. ఆ తర్వాత మార్గదర్శకాల రూపకల్పనకు రెండు నెలల సమయం పడుతుందన్నారు. తాను మంత్రిగా బాద్యతలు స్వీకరించిన తర్వాత ఖమ్మం జిల్లా మాజీ మంత్రి తనుకు ఎదురుపడలేదని.. పువ్వాడ అంజయ్ ను ఉద్దేశించి చెప్పారు. ఆయన అసలు ఉన్నాడా? లేడా అన్నట్లు నడుస్తోందని సెటైర్లు వేశారు.
కేటీఆర్ తప్పించుకోలేడు
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై స్పందించిన మంత్రి తప్పు ఎవరు చేసినా ఏదో ఒక రోజు బయటపడుతుందని చెప్పారు. అయితే వారు చేసింది తప్పా ఒప్పా అనేది తేల్చేది కోర్టులేనన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. అయితే ఎంతటి రాజకీయ చరిత్ర, అనుభవం ఉన్నా కోర్టులు,వ్యవస్థల ముందు బలప్రదర్శన చేయడం సరికాదన్నారు. ప్రజా ప్రభుత్వానికి బీఆర్ఎస్ నాయకులు టార్గెట్ కాదన్న పొంగులేటి తాము ఎవరినీ టార్గెట్ చేయడం లేదని వివరణ ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ కేసు వ్యవహారంలో కేటీఆర్ ఏ తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. కొత్త సంవత్సరంలో కేటీఆర్ లో ఆత్మవిశ్వాసం పెరిగిందని చురకలంటించారు.
కాంగ్రెస్ పార్టీకి బాండ్స్ ఎందుకు ఇచ్చారో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలే చెప్పాలన్నారు. బాండ్స్ మాత్రమే కాదు ఇంకా బయట పడాల్సినవి చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. విదేశీ కంపెనీకి వెళ్లిన డబ్బులు ఎవరి ఖాతాకు వెళ్లాయో తేలాల్సి ఉందన్నారు. ప్రాంతీయ పార్టీల్లో అత్యంత ధనిక పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ఎసేననీ ఆ పార్టీకి అంత డబ్బు ఎలా వచ్చిందో తెలియాల్సి ఉందన్నారు. జాతీయ పార్టీలకు లేని నిధులు ప్రాంతీయ పార్టీకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ ఏ కేసులో ఉన్నా హరీష్ రావు అక్కడ ఉంటారని చెప్పారు.