ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నేటి సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాంకేతిక పరిజ్ఞానం వంటి వాటిపై దృష్టి సారించాలని జిల్లా న్యాయమూర్తి శ్రీవాణి పిలుపునిచ్చారు. స్థానిక దివ్య గార్డెన్ లో ఆదివారం జరిగిన
వశిష్ట డిగ్రీ కళాశాల రజతోత్సవాల్లో ముఖ్యఅతిథిగా ఆమె హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా నిర్మల్ పురపాలక సంఘం చైర్ పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి హాజరయ్యారు.ఈ సందర్భంగా న్యాయమూర్తి శ్రీవాణి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ కలిగిన వ్యక్తిత్వం, నైతిక విలువలు, నిరంతర శ్రమతో సాధన చేస్తే ఏ రంగంలోనైనా రాణించడం సులువవుతుందని అన్నారు. తల్లిదండ్రులు గర్వపడేలా చదువుపై దృష్టి నిలిపి ఉన్నత స్థాయిలో నిలబడాలని కోరారు. నేటి యువతలో కొందరు గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు అవుతూ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. ఉన్నత లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. ప్రతి విద్యార్థి సామాజిక దృక్పథం, దేశ భక్తిని పెంపొందించుకొని మంచి పౌరులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ వి. సత్యనారాయణ గౌడ్, కరస్పాండెంట్ ఎన్.ఆర్. సరోత్తమ్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అఖిలేష్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.