- కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన మాటలన్ని ఉత్తుత్తివే.
- తెలంగాణ పాలిట రేవంత్, ఉత్తమ్ లే వైట్ ఎలిఫెంట్లు.
- ధ్వజమెత్తిన హరీశ్ రావు.
ముద్ర, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇష్టారీతిగా మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మతి భ్రమించినట్లుందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.చెప్పిన అబద్దాన్నే మళ్లీ మళ్లీ చెబితే ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఆయన ఉండటం దౌర్భాగ్యమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై దుష్ప్రచారం చేయడమే సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ లకు సింగిల్ పాయింట్ ఎజెండా గా మారిందని ధ్వజమెత్తారు.ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లను, పంప్ హౌజ్ అను వాడుకుంటూనే మరోవైపు అది వైట్ ఎలిఫెంట్ అనడం శోచనీయమని వ్యాఖ్యానించారు. వారిద్దరే తెలంగాణ పాలిట వైట్ ఎలిఫెంట్లు అని మండిపడ్డారు.ఒకరు రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతుండగా మరొకరు నీటి వాటాకు గండి కొడుతున్నారని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.ఏడాదిన్నర నుంచి కాళేశ్వరం మీద కుట్రలు చేయడం తప్ప ఎక్కడా ఒక ప్రాజెక్టు పూర్తి చేసింది లేదన్నారు. అలాగే ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చింది లేదన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చడం కమిషన్ల కోసమే అని అదే పనిగా కారు కూతలు కూయడం తగదన్నారు.తుమ్మిడిహెట్టి వద్ద తగినంత నీటి లభ్యత లేదని సిడబ్లుసీ చెప్పింది మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.