ముద్ర, గద్వాల:
ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు అందజేస్తున్న సన్నబియాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలోని గంజిపేట రహదారిలో ఉన్న చౌక ధరల దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పంపిణీ పథకంలో భాగంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తోందన్నారు. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం కోటాను ఇదే నెలలో ఒకేసారి అందచేయడం జరుగుతుందన్నారు. దుకాణం పరిధిలోని తెల్లరేషన్ కార్డులు, అంత్యోదయ కార్డుల వివరాలను కలెక్టర్ సంబంధిత రేషన్ డీలర్ ను అడిగారు. అలాగే పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులకు బయోమెట్రిక్ వేలిముద్ర ద్వారా రేషన్ బియ్యం పంపిణీ పరిశీలించారు.