ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండం బి పవర్ హౌస్ గడ్డ రాజీవ్ రహదారి సమీపంలో భారీ హనుమాన్ విగ్రహ నిర్మాణ పనులను రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్, ఆయన సతీమణి మనాలి ఠాగూర్ సోమవారం పరిశీలించారు. గతంలో ఈ గుట్టపై బయటపడిన హనుమాన్ విగ్రహం స్థానములో 150 ఫీట్ల భారీ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే దంపతులు శ్రీకారం చుట్టారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దంపతులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు విగ్రహ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు.నిర్మాణం జరుగుతున్న తీరును సదరు కాంట్రాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు.ఇదే క్రమంలో గుట్టపై బయటపడిన చిన్నపాటి విగ్రహం ప్రదేశంలోనే భారీ విగ్రహాం ఏర్పాటుకు రూపకల్పన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి అభయాంజనేయ స్వామి దీవెనలు ఎల్ల కాలం ఉండాలని, ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అన్నారు.వీలైనంత త్వరలో విగ్రహ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మారెల్లి రాజిరెడ్డి ఉన్నారు.