ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్లోని జవహర్ నగర్లో కూలగొట్టిన పేదల ఇళ్ళను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జవహర్ నగర్, బాలాజీ నగర్ ప్రాంతాలు 50 ఏళ్ళ క్రితం పొట్ట చేతపట్టుకుని వచ్చిన నిరుపేదలకు ఆశ్రయం కల్పించాయన్నారు. కడు బీదరికంలో ఉన్న వారు అప్పడు కట్టుకున్న ఇళ్ళను ఇప్పుడు కూలగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఇళ్ళకు భద్రత లేదని ఆయన దుయ్యబట్టారు. భూ కబ్జాదారుల మీద చర్యలు తీసుకునే దమ్ము లేదు కానీ 30 గజాలలో ఇళ్ళను నిర్మించకున్న వారి ఇళ్ళను కూలగొట్టడం రేవంత్ సర్కార్ మూర్ఖత్వమని ఆయన మండిపడ్డారు. జవహర్ నగర్, బాలాజీ నగర్ భూములు ఎక్స్ సర్వీస్ మెన్లకు చెందినవని, ఆ భూమిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని ఎంపీ ఈటల అన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళ మీద రేవంత్ సర్కార్ ప్రతాపం చూపించండం దారుణమన్నారు. ల్యాండ్ మాఫీయా మీద ఉక్కుపాదం మోపాలని ఆయన డిమాండ్ చేశారు.