ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం కమిషనర్ నాగిరెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగిన ఇద్దరు సభ్యులు (వారిలో ఒకరు మహిళ ఉండాలి) మరియు అల్పసంఖ్యాక వర్గానికి చెందిన ఇద్దరు సభ్యులు (వారిలో ఒకరు మహిళ ఉండాలి)ను చట్టప్రకారం ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు మున్సిపల్ కౌన్సిల్ ఓటరు జాబితాలో నమోదై ఉండి, కనీసం 21 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అదనంగా, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ లేదా వార్డు సభ్యుడిగా కనీసం ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి. లేదా సంబంధిత రెవెన్యూ మండలంలోని గ్రామపంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్ లేదా వార్డు సభ్యుడిగా ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
లేదంటే మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్లో కనీసం మూడు సంవత్సరాలు పనిచేసిన అడ్వకేట్ అయి ఉండాలి. లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థల్లో గెజిటెడ్ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయి, మున్సిపల్ పరిపాలనలో అనుభవం కలిగి ఉండాలి.
అల్పసంఖ్యాక వర్గానికి చెందిన అభ్యర్థులు కూడా మున్సిపల్ ఓటరు జాబితాలో నమోదై ఉండి, కనీసం 21 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలని పేర్కొన్నారు. వారు తప్పనిసరిగా అల్పసంఖ్యాక వర్గానికి చెందిన వారై ఉండాలి.
అర్హతలు కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులతో పాటు అవసరమైన ధృవపత్రాలను జతపరచి ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నాగర్ కర్నూల్ పురపాలక సంఘ కమిషనర్ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు.