ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :
గవర్నమెంట్ డిగ్రీ మరియు పీజీ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ వ్యాపార దిగ్గజం అజీమ్ ప్రేమ్జీ సంస్థ తరఫున అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ నిపుణులు బాదామి కుమార్ పాల్గొని విద్యార్థులకు వివిధ కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిగ్రీ పూర్తయ్యాక అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్య కోర్సులు, వాటిలో చేరడానికి అనుసరించాల్సిన విధానాలపై సమగ్రంగా వివరించారు. విద్యార్థులు తమ ఆసక్తి, ప్రతిభలకు అనుగుణంగా సరైన దారిని ఎంచుకుని ముందుకు సాగాలని సూచించారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. గీతాంజలి మాట్లాడుతూ, డిగ్రీ అనంతరం విద్యార్థులు ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలో తమకు నచ్చిన విభాగాల్లో రాణించాలని, నిరుద్యోగులుగా మిగలకుండా ముందస్తు ప్రణాళికతో కెరీర్ను నిర్మించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, అధ్యాపకులు ధర్మ సతీష్, మల్లికార్జున్, ప్లేస్మెంట్ అధికారి దీపికతో పాటు ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు.