జిల్లాలోని చెరువుల సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించాలి వన మహోత్సవానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలి -కలెక్టర్ ప్రతీక్ జైన్
ముద్ర, నారాయణపేట:
జిల్లాలోని మొత్తం 375 చెరువుల సర్వే చేసి వాటికి సరిహద్దులు నిర్ణయించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో మొక్కల పెంపకం లక్ష్యాలపై జిల్లా స్థాయి పర్యవేక్షణ సమన్వయ కమిటీ సమావేశం, అలాగే చిత్తడి నేలలు డీమ్డ్ ఫారెస్ట్ల పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ…జిల్లాలో వన మహోత్సవంలో భాగంగా నాటేందుకు మొక్కలను సిద్ధం చేయాలన్నారు. జిల్లాకు 12 లక్షల 71 వేల మొక్కలు నాటడం లక్ష్యం గా ఉందని, శాఖల వారీగా ఎవరెవరికి ఎంత టార్గెట్ ఉందో వాటిని చేరుకోవాలని ఆదేశించారు. వన మహోత్సవంలో నాటేందుకు పొడవాటి మొక్కలు, పూల మొక్కలు, మల్బరీ మొక్కలు, పండ్ల మొక్కలను నిల్వ చేసుకోవాలన్నారు. అన్ని శాఖలకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. రెవెన్యూ, నీటి పారుదల, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో చెరువుల సరిహద్దులను సూచించాలన్నారు. శిఖం భూములు, పట్టా భూముల వివరాలను నమోదు చేయాలన్నారు. వారం రోజుల్లో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసుకుందాం అని, అంతలోపు ఎన్ని చెరువులకు సరి హద్దులు చేస్తారో చేయాలని కలెక్టర్ ఆదేశించారు.