అంగన్వాడి సేవలు నేడు సమాజానికి కీలకంగా మారాయని , బాల బాలికలకు , గర్భవతులకు పుష్టికరమైన ఆహారము అందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల వ్యవస్థను ప్రవేశపెట్టిందని కరీంనగర్ మేయర్ కొలగని శ్రీనివాస్ అన్నారు. గురువారం రోజున కోతి రాంపూర్ పరిధిలో గల అంగన్వాడీల కేంద్రాల ఐసిడిఎస్ కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆరు సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పౌష్టికాహారం, ముందస్తు విద్య, ఆరోగ్య తనిఖీలు , టీకాలు వంటి ఎన్నో ముఖ్యమైన సేవలు అంగన్వాడీల ద్వారానే అందుతున్నాయన్నారు. ఈ సేవలు అందించడంలో అంగన్వాడి టీచర్లు కీలక భూమిక పోషిస్తున్నారని తెలిపారు. గర్భిణీలు బాలింతలకు అవసరమైన పోషకాహారం తో పాటు పిల్లల పెరుగుదల, ఆరోగ్య పటిష్టత కోసం అందించే బాలామృతం, కోడిగుడ్లు ను సక్రమంగా అందించాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్లపై ఉందన్నారు. ఎందుకంటే పిల్లల తల్లుల అభివృద్ధి ఎదుగుదల అంగన్వాడి టీచర్ల పనితీరుపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా పేదవారి పిల్లలు, పేద మహిళలకు అంగన్వాడీ పరిధిలో మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాసం గణేష్, పడిశెట్టి వసంత లక్ష్మి భూమయ్య, డి డబ్ల్యు ఆఫీసర్ సరస్వతి, సిడిపిఓ ఆఫీసర్
సబితలతో పాటు ఐసిడిసిఎస్ సూపర్వైజర్స్, స్టాఫ్, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
