Take a fresh look at your lifestyle.

తెలంగాణ నుంచి తిరుపతి.. అందుబాటులోకి కొత్త హైవే

అటవీ ప్రాంతం మీదుగా కొండలు, లోయల మధ్య ఆహ్లాదకర ప్రయాణం
నేషనల్ హైవే 565 అందుబాటులోకి
యర్రగొండపాలెం వద్ద పూర్తయిన పనులు
తిరుపతి, తెలంగాణ మధ్య ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం

ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కీలకమైన నేషనల్ హైవే 565 పనులు పూర్తి చేశారు. ఈ హైవేపై వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఈ హైవే పనుల్లో భాగంగా.. యర్రగొండపాలెం దగ్గర 20 కిలో మీటర్ల రోడ్డును విస్తరించారు. దీంతో హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఊరట దక్కింది. ఈ 20 కిలో మీటర్లు అటవీ ప్రాంతం మీదుగా వెళుతోంది.. బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లతో ప్రయాణం సాఫీగా సాగుతోంది.
తెలుగు రాష్ట్రాల మధ్య నేషనల్ హైవే 565 అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలోని నకిరేకల్ వద్ద మొదలయ్యే ఈ హైవే.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి సమీపంలో ఉన్న ఏర్పేడు దగ్గర ముగుస్తుంది. ఈ కొత్త హైవే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65ని.. మదనపల్లె నుంచి నాయుడుపేట వెళ్లే నేషనల్ హైవే 71తో కలుపుతుంది. తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లడానికి ఈ కొత్త హైవే ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడనుంది.
ఈ హైవే నల్గొండ, మాచర్ల, యర్రగొండపాలెం, మార్కాపురం, పొదిలి, కనిగిరి, పామూరు, దుత్తలూరు, రాపూరు, వెంకటగిరి, ఏర్పేడు మీదుగా వెళుతోంది. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నుంచి హైదరాబాద్ రాత్రిళ్లు అటవీ ప్రాంతం మీదుగా వెళ్లడం గతంలో చాలా ఇబ్బందిగా ఉండేది. ముఖ్యంగా పుల్లల చెరువు దగ్గర నుంచి వెల్దుర్తి మండలం వరకు రోడ్డు పరిస్థితి దారుణంగా ఉండేది. ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యేవి. అయితే జాతీయ రహదారి 565 నిర్మాణంతో ఆ కష్టాలు తొలగిపోయాయి. ఈ రోడ్డు అభివృద్ధి చేయడంతో యర్రగొండపాలెం నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం సులభతరమైంది.
ఈ రూట్‌లో.. ఎన్‌హెచ్‌-565లో భాగంగా ఉన్న ఈ 20 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు గతంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా అటవీ అనుమతులు ఆలస్యం కావడంతోపాటు మరికొన్ని అడ్డంకులు వచ్చాయి. అయితే 2024లో ఈ పనులకు లైన్ క్లియర్ కావడంతో.. గతేడాది పనులు ప్రారంభించి వేగవంతం చేశారు. ఈ రోడ్డును నిర్దేశిత సమయం కంటే ముందే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. అటవీ ప్రాంతం మీదుగా కొండలు, లోయల మధ్య వెళ్లే ప్రయాణికులకు ఈ మార్గం సరికొత్త అనుభూతిని పంచుతోంది.
గతంలో రోడ్డు బాగోలేకపోవడంతో పుల్లలచెరువు నుంచి వెల్దుర్తి మండలం వరకు ప్రయాణానికి 50 నిమిషాలు పట్టేది. కానీ ఇప్పుడు 20 నిమిషాల్లోనే వెళ్లొచ్చు. 20 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు నిర్మాణానికి రూ.393 కోట్లు ఖర్చు చేశారు. అటవీ ప్రాంతం, ఘాట్ రోడ్డు కావంతో చిన్న, పెద్దవి కలిపి మొత్తం 16 వంతెనలు, 8 అండర్‌పాస్‌లను ఏర్పాటు చేశారు.
మార్కాపురం జిల్లాతో కడప జిల్లాలోని పోరుమామిళ్ల ప్రాంతం నుంచి ఈ రోడ్డు మీదుగానే హైదరాబాద్‌ వెళ్లొచ్చు. ఈ హైవే మొత్తం పొడవు దాదాపు 420 కిలోమీటర్లు కాగా.. మెజార్టీ భాగం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. తెలంగాణలోని నకిరేకల్, నల్గొండ, కనగల్, దేవరకొండ ప్రాంతాలను దాటిన తర్వాత మాచర్ల వద్ద ఈ హైవే ఏపీలోకి ఎంటర్ అవుతుంది. ఏర్పేడు వద్ద ఎడమ వైపు ప్రయాణిస్తే శ్రీకాళహస్తి, కుడి వైపు తిరిగే తిరుపతి వెళ్లొచ్చు.

Leave A Reply

Your email address will not be published.