బోడుప్పల్, ముద్ర విలేకరి: శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజున బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలోని శ్రీ నిమిషాంబికా మాత చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో దర్శనభాగ్యం కల్పించారు. మానవులకి సకల విద్యల్ని ప్రసాదించి, వారిలో జ్ఞాన దీపాలను వెలిగించే విద్యాశక్తి సరస్వతి, త్రిశక్తుల్లో ఒక మహాశక్తి రూపంలో దర్శన భాగ్యం కల్పిస్తున్నారు- అమ్మవారిని దర్శించుకోవడం వలన ఆధ్యాత్మిక విజ్ఞానానికి, మానసిక శాంతి, సృజనాత్మకత, అందుతాయని భక్తుల విశ్వాసం.
ఘనంగా సామూహిక సరస్వతీ దేవి హోమం
నిమిషాంబికా ఆలయంలో సోమవారం విద్యార్థినీ, విద్యార్థులతో సామూహికంగా సరస్వతీదేవి హోమం నిర్వహించారు. వందలాదిగా విద్యార్థినీ, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు హాజరై హోమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధానార్చకులు చంద్రశేఖర శర్మ, అర్చకుడు ఉమాకాంత శర్మతో పాటు ఇతర అర్చకస్వాములు హోమం జరిపించారు.
ఆలయానికి విచ్చేసిన భక్తులకు ధర్శనం కల్పించడంతో పాటు, వారికి ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు ఏర్పాట్లు చేశారు. నిమిషాంబిక ఆలయ ట్రస్ట్ ధర్మకర్తలు ఎమ్. శ్రీనివాస్ రావు, ఎమ్. సాయి బాబా (శ్యామ్), డి. సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, ఎన్. రామకృష్ణ, బి. హిమచందర్, వై. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.