Take a fresh look at your lifestyle.

నిమ్జ్‌లో మౌలిక వసతుల అభివృద్ధి–జిల్లా కలెక్టర్ సమీక్ష

 

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి :

జహీరాబాద్ ప్రాంతంలోని నిమ్జ్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు . సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నిమ్జ్ మొదటి దశ లో స్వాధీనం చేసుకున్న భూముల సరిహద్దుల గుర్తింపు, పెంచింగ్ పనులు, సమీప రహదారుల అభివృద్ధి, నిమ్జ్ కు అనుసంధానించే ముఖ్య మార్గాల విస్తరణ వంటి అంశాలపై నిమ్జ్ ,టి జి ఐ ఐ సి అధికారులు , సర్వే, రెవిన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు .
ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ నిమ్జ్ లో మౌలిక వసతులు కల్పించే ఎస్ఆర్అర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇప్పటి వరకు సేకరించిన భూములను అప్పగించాలని కలెక్టర్ సూచించారు. లే అవుట్ అభివృద్ధి చేసేందుకు వీలుగా పది రోజుల్లో సర్వే పూర్తి చేయాలన్నారు. లే అవుట్ ప్రకారం రోడ్లు, ఇతరత్ర మౌలిక వసతులు కల్పించేందుకు సేకరించిన భూముల్లో హద్దురాళ్ళను ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
గతంలోనే భూములు తీసుకుని రైతులకు నష్ట పరిహారం చెల్లించామని కానీ మొన్నటివరకు ఆ భూముల్లో పనులు చేపట్టకపోవడంతో పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఇచ్చామని కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం అభివృద్ధి పనులు చేపట్టనుండటం తో ఇకపై పంటలు వేయకుండా చూడాలని, ఇదివరకే పంటలు వేసి ఉంటే కోతలు పూర్తయ్యే వరకు వేచి చూడాలన్నారు. సర్వే ఎలాంటి ఆటంకాలు లేకుండా శాంతియుత వాతావరణం లో నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సర్వే సందర్భంగా వేసిన హద్దు రాళ్ళను రైతులేవరూ తొలగించవద్దని, అలా చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశం లో అడిషనల్ కలెక్టర్ లు మాధురి, పాండు లతో పాటు టీజిఐఐసి జోనల్ మేనేజర్ విఠల్, జహీరాబాద్ ఆర్డీవో దేవుజా, నిమ్జ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశాలాక్షి , తహసిల్దార్ లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.