- బాధిత యువతికి అండగా ఉంటాం.
- ఊర్కొండ సామూహిక అత్యాచార ఘటనపై అనిరుధ్ రెడ్డి స్పష్ఠీకరణ.
ముద్ర ప్రతినిధి జడ్చర్ల, : ఊర్కొండ మండలంలోని పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీని కోరానని ఆయన వెల్లడించారు.ఊర్కొండలోని ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో ఆరుగురు యువకులు ఒక వివాహిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలోనే సోమవారం జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తో ఫోన్లో మాట్లాడిన అనిరుద్ రెడ్డి పవిత్ర ప్రదేశంలో ఈ దురాగతానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.అత్యాచారానికి పాల్పడిన వారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారని తన దృష్టికి వచ్చిందని అయితే ఈ సంఘటనకు పాల్పడింది ఎవరైనాప్పటికీ తాను రాజకీయాలు చేయదలుచుకోలేదని బాధిత యువతికి న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు.ఈ సంఘటనలో బాధిత యువతికి అండగా ఉంటానని అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ సంఘటన నేపథ్యంలోని ఊర్కొండ పోలీసులతో కూడా మాట్లాడి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి రాత్రి పూట బస చేసే భక్తులకు రక్షణ కల్పించాలని కోరారు.గ్రామంలోనీ యువతులు కూడా జరిగిన సంఘటన పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కూడా అనిరుధ్ రెడ్డి ఆదేశించారు.