- నేను వివరిస్తా.
- ఈ నెల 2న ప్రజంటేషన్ ఇవ్వనున్న హరీశ్రావు.
- కేసీఆర్తో వరుస భేటీ తర్వాత నిర్ణయం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : వరుస వివాదాలు, పార్టీలో సమస్యలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీ.. ఒక్కొక్కటిగా కొన్ని అంశాలను వివరించేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తో పలుమార్లు సమావేశమైన మాజీ మంత్రి హరీశ్రావు పలు కీలక అంశాలపై చర్చించారు. కమిషన్ ముందుకు వెళ్లడమా.. లేదంటూ ఏదైనా కారణంతో వాయిదా వేసుకునే ప్రయత్నం చేయడమా అనేది ఇంకా తేలలేదు. కానీ, ప్రస్తుతం ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 2న హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.ఈ నోటీసుల వ్యవహారంపై ఓవైపు కల్వకుంట్ల కవిత కూడా నిరసనలకు పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర నిరసనకు దిగుతున్నారు. కవిత నిరసనలు ఈ నెల 4న ఉండగా.. అంతకు ముందు హరీశ్రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఈ ప్రాజెక్టు నిర్మాణం, వ్యయం, తమ కష్టం అంతా వివరించనున్నారు.ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతారా లేదా అనేది మళ్లీ అనుమానంగా మారింది.