ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్
జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనా బడ్జెట్ సమావేశాన్ని శుక్రవారం మున్సిపల్ చైర్మన్ సురేంద్ర కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, ఐఏఎస్ హాజరయ్యారు. మున్సిపాలిటీ బడ్జెట్ అంచనాలను సిద్ధం చేసి కౌన్సిల్ ఆమోదంతో ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
నాగర్ కర్నూల్ పురపాలక సంఘం 2025–2026 సంవత్సరపు సవరణ బడ్జెట్ మరియు 2026–2027 సంవత్సరపు అంచనా బడ్జెట్ ప్రకారం సాధారణ ఆదాయం రూ.920.49 లక్షలుగా అంచనా వేశారు. ఆదాయాల్లో ఆస్తి పన్ను ద్వారా రూ.559.60 లక్షలు, ఇతర పన్నుల ద్వారా రూ.360.81 లక్షలు, ప్రారంభ నిల్వగా రూ.703.42 లక్షలు ఉండగా మొత్తం ఆదాయం రూ.1623.91 లక్షలుగా నిర్ణయించారు.
అదేవిధంగా వ్యయాల్లో జీతాల కోసం రూ.300.00 లక్షలు, పారిశుద్ధ్య విభాగానికి రూ.157.15 లక్షలు, కరెంట్ బిల్లుల కోసం రూ.75.00 లక్షలు, గ్రీన్ బడ్జెట్ కింద రూ.92.49 లక్షలు, ఇతర వ్యయాల కోసం రూ.968.63 లక్షలు కేటాయించారు. మొత్తం వ్యయం రూ.1593.27 లక్షలుగా అంచనా వేశారు.
ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, కౌన్సిలర్లు మరియు అధికారులు పాల్గొన్నారు.