ముద్ర పెబ్బేర్
ఉమ్మడి పెబ్బేరు మండల పరిధిలోని పాతపల్లి, నాగసానిపల్లి గ్రామాల సరిహద్దుల్లో వెలసిన చారిత్రాత్మక చింతకుంట ఆంజనేయస్వామి ఆలయం ప్రస్తుతం సమస్యల నిలయంగా మారింది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వెలుగొందుతున్న చింతలకుంట ఆంజనేయస్వామి క్షేత్రానికి ప్రతి శనివారం మరియు విశేష పర్వదినాల్లో వందల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అయితే, ఆలయ పరిసరాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రవాణ ఇబ్బందులు వలన ఆలయానికి చేరుకోవడానికి సరైన రహదారి సౌకర్యం లేక, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో దూరప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు.క్షేత్రం వద్ద మరుగుదొడ్లు, మూత్రశాలల సౌకర్యం లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా మహిళా భక్తులు, వృద్ధులు ఆరుబయట వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నీటి వసతి,విశ్రాంతి గదులు లేక వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో తాగునీటి సౌకర్యం మరియు ఎండ నుండి ఉపశమనం పొందేందుకు సరైన విశ్రాంతి గదులు (షెడ్లు) అందుబాటులో లేవు.
భక్తుల డిమాండ్..??
దూర ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే తమకు ఈ నరకయాతన తప్పదని భక్తులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, వెంటనే ఆలయ ప్రాంగణంలో మరుగుదొడ్ల నిర్మాణం, రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని గ్రామస్థులు మరియు భక్తులు కోరుతున్నారు.