ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 60 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించగా, 10,651 మంది విద్యార్థులకు గాను 10,630 మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. 21 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, దీంతో తొలి రోజు పరీక్షకు 98.80 శాతం హాజరు నమోదైందని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ తెలిపారు.

ఇదివరకు పరీక్షల్లో తప్పిన ప్రైవేట్ విద్యార్థులు 5 మందిలో 4 మంది హాజరై పరీక్ష రాయగా, ఒక విద్యార్థి గైర్హాజరైనట్లు తెలిపారు. జిల్లాలో తొలి రోజు పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగిసినట్లు డీఈఓ పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు మొత్తం 34 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. ఆయన స్వయంగా పాలెం, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లోని రెండు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పరీక్ష నిర్వహణను పరిశీలించారు.