Take a fresh look at your lifestyle.

నీతి, నిజాయితీలకు నిలువుటద్దం నర్రా రాఘవరెడ్డి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

 
ముద్ర, చిట్యాల :
నీతి, నిజాయితీలకు నిలువుటద్దంగా, ప్రజలకు నిస్వార్థ సేవలందించిన ప్రజా నాయకుడు నర్రా రాఘవరెడ్డి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో జరిపిన అమరజీవి నర్రా రాఘవరెడ్డి 11వ వర్థంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, ప్రజల పక్షపాతిగా అసెంబ్లీలో తమ వాణి పాలకులకు వినిపించిన రాఘవరెడ్డి లాంటి నాయకులు కరువైనారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా సాగు తాగునీటి కోసం పట్టుబట్టి యస్ యల్ బి సి నీటిని రప్పించిన ఘనత సిపిఎం శాసన సభ్యులకు, నర్రా రాఘవరెడ్డి కి ఉందని చెప్పారు. ఆరు పర్యాయాలు నకిరేకల్ ఎమ్మెల్యే గా, సిపిఎం శాసన సభా పక్ష నాయకుడిగా పనిచేసి, అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలతో మెప్పించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన రాఘవరెడ్డి సేవలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు మరువలేనివని కొనియాడారు. రాఘవరెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేయడమే కమ్యూనిస్టు కార్యకర్తల ముఖ్య కర్తవ్యం అని అన్నారు.పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ గా, సమితి ప్రెసిడెంట్ తోపాటు సుదీర్ఘ కాలం నకిరేకల్ ఎమ్మెల్యే గా పని చేసి, రైతు, కూలీల సమస్యలే కాకుండా కల్లు గీత, గొర్రెల మేకల పెంపకం దారుల,గ్రామ సేవకుల హక్కుల కోసం పని చేసి, కొత్త జీ.వో లను సాధించారని అన్నారు. ప్రజా నాట్య మండలి కళాకారుడిగా పల్లె సుద్దులు చెప్పి,పాలక పక్షాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేసిన ప్రజల మనిషి అని చెప్పారు. నకిరేకల్ నియోజకవర్గం తోపాటు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసి, మాతో పనిచేయించిన ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయం అని అన్నారు. ముందుగా రాఘవరెడ్డి విగ్రహానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ జెండాను జూలకంటి రంగారెడ్డి ఆవిష్కరించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి,రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి,నారీ ఐలయ్య, జిల్లా కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య,జిట్ట సరోజ,మల్లం మహేష్,పెంజర్ల సైదులు, చింతపల్లి బయ్యన్న, మండల పార్టీ నాయకులు రాచకొండ శ్యాం సుందర్, శీలా రాజయ్య, అరూరి శ్రీను,ఐతరాజు నర్సింహా, యాదయ్య, కల్లూరి కుమార స్వామి, మెట్టు నర్సింహా, పంది నరేష్, జిట్ట స్వామి,అక్కెనపల్లి నాగయ్య వివిధ ప్రజా సంఘాల నాయకులు నర్రా కిశోర్,పాలమాకుల అర్జున్, చింతపల్లి క్రిష్ణయ్య, బూరుగు విజయ్, శ్రీను, నర్రా శేఖర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రమేష్, బాబురావు,యాదయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.