ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా లో హిందువులపై వరుస దాడులకు నిరసనగా బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతం అయిందని బీజేపీ సీనియర్ నేత రావుల రామ్ నాథ్ అన్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు తమ వైఖరి మార్చుకోవాలని ఆయన సూచించారు. నిర్మల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత కొద్ది కాలంగా నిర్మల్ లో హిందువులపై జరుగుతున్న వరుస దాడులకు, డా. సంతోష్ రాజ్ పై జరిగిన దాడికి నిరసనగా ఈ బంద్ నిర్వహించినట్లు తెలిపారు. ఇటీవల స్థానిక పాత బస్టాండ్ సమీపంలో కారులో వెళ్తున్న హిందూ కుటుంబంపై దాడి, గతంలో భైంసా లో కె టి ఆర్ పర్యటన నినాదాలు చేసిన హనుమాన్ స్వాములపై 307 కేసుల వంటి వరుస ఘటనల పట్ల బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బంద్ విజయవంతం అయిన నేపథ్యంలో పోలీసులు తమ వైఖరిని మార్చుకొని అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూడాలని కోరారు. బంద్ కు సహకరించిన వ్యాపార సంఘాలకు, ప్రజలకు బీజేపీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు, పట్టణ కౌన్సిలర్లు, పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.