(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి):
జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ద కనబరచాలని ప్రత్యేక డిప్యూటి కలెక్టర్ కే శ్రీనివాస్ సూచించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి (43) ఫిర్యాదులు అందాయి. ప్రజల నుండి వివిధ అంశాలకు సంబంధించిన ఫిర్యాదుల వినతి పత్రాలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.శ్రీనివాస్ జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమము కేవలం సమస్యలు విని దరఖాస్తులు స్వీకరించే విధంగా కాకుండా, పరిష్కారాల వేదికగా నిలిచేలా ప్రతి ఒక్కరు పని చేయాలని, ఫిర్యాదులు స్వీకరించిన వెంటనే పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని సమస్యలు పరిష్కరించే వేదికగా మార్చాలని తెలిపారు. ఫిర్యాదులు సమర్పించడానికి వచ్చిన ప్రజలకు అవసరమైన సూచనలు, సహాయం అందించడంలో అధికారులు సిబ్బంది చొరవ చూపాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ శాఖవి– 22, ఇతర శాఖలవి మొత్తం 21, మొత్తం 43 దరఖస్తులు అందాయి. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.