ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క లకు నిరసన సెగ వ్యక్తమైంది. రాష్ట్రంలో కొన్ని మండలాలను పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించి భూభారతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యం లో నిర్మల్ జిల్లాలోని కుంటాల మండలాన్ని పైలెట్ మండలంగా ఎంపిక చేశారు. కాగా శుక్రవారం మండల కేంద్రంలో భూభారతి అవగాహన కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కలకు బిఆర్ఎస్ తోపాటు పలువురు రైతుల నిరసన సెగలు ఎదుర్కోవాల్సి వచ్చింది.ధాన్యం కొనుగోళ్లలో చేస్తున్న జాప్యం, అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను పోలీస్ స్టేషన్లకు తరలించారు.