- విగ్రహ ఏర్పాటుకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ముద్దు బిడ్డ.. మౌనముని భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు సముచిత గౌరవం లభించింది. ఆయన విగ్రహాన్ని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేయాలని దేశ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ)ప్రతిపాధనలు పెట్టింది. ఆ విగ్రహ ఏర్పాటుకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. అతి త్వరలో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. పీ.వీ. నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ 2024 ఏప్రిల్ లో ఎన్ఎండీసీకి లేఖ రాసి, ఆంధ్ర భవన్ లేదా తెలంగాణ భవన్ వద్ద పీవీ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరింది. విగ్రహం కాంస్యంతో తయారు చేయాలని, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం విగ్రహం పక్కన ఉంచాలని ప్రతిపాదించింది. కాగా ఈ ప్రతిపాదనను న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఈ ఏడాది మార్చి 27 జరిగిన సమావేశంలో ప్రతిపాదించింది.