ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల
మూడు విడతల్లో రైతులకు జమ
ఈసారి 9 వేల కోట్ల రైతు భరోసా
ముద్ర, తెలంగాణ బ్యూరో:
రైతు భరోసా విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 22న రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతు భరోసా నిధులు సీఎం విడుదల చేయనున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ముందుగా తొలి విడతగా 70 లక్షల మందికి భరోసా
రైతు భరోసాలో భాగంగా తొలి విడతగా మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక ఎకరం వరకు రైతు భరోసా కింద రూ.3,590 కోట్లు బదిలీ చేయనున్నారు. రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత రూ.2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా మొత్తం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. మూడు విడతల్లో కలిపి మొత్తంగా రైతుల ఖాతాల్లో సుమారు రూ.9 వేల కోట్లు రైతు భరోసా నిధులు జమ కానున్నాయి.