ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
సిద్దిపేట జిల్లాలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన జిల్లా సర్వసభ్య సమావేశంలో 2026–27 ఉగాది సందర్భంగా తెలుగు పంచాంగాన్ని రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్ గౌడ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాశాఖ పనితీరును ప్రశంసించారు. సమస్యల పరిష్కారంలో సంఘం ఎప్పుడూ ముందుంటుందని, ప్రాథమిక విద్య బలోపేతమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ప్రాథమిక ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యా రంగంలో బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాథమిక విద్యకు కనీసం సగభాగం కేటాయించాలని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని కోరారు. సిబ్బంది పునర్వ్యవస్థీకరణలో ప్రధానోపాధ్యాయ పదవిని సాధారణ ఉపాధ్యాయ పదవిగా పరిగణించవద్దని సూచించారు. పాఠశాల సముదాయాల నిర్వహణ బాధ్యతలను ప్రధానోపాధ్యాయులకే అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు.జిల్లా అధ్యక్షుడు సత్యానంద్ మాట్లాడుతూ పంచాంగం ప్రచురణకు కృషి చేసిన శ్యాంసుందర్ రావును అభినందించారు. జిల్లాలో ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, గౌరవ అధ్యక్షుడు పద్మారెడ్డి, సహాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, హరిహర ప్రసాద్, పాల్గొన్నారు