- రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా స్వీకరణ.
- అభినందనలు తెలిపిన సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: సింగరేణి హైదరాబాద్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారి(పీఆర్ఓ)గా పనిచేస్తున్న శ్రీ రాముల శ్రీకాంత్ తాను సమర్పించిన పరిశోధన అధ్యయ నానికి తెలంగాణ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్నారు. బుధవారం నిజామాబాద్ లోని తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన రెండో స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్స్లర్ జిష్ణుదేవ్ వర్మ నుండి డాక్టరేట్ సర్టిఫికెట్ ను శ్రీరాముల శ్రీకాంత్ స్వీకరించారు. ‘సాంఘిక,రాజకీయ ఉద్యమాల్లో సామాజిక మాధ్యమాల పాత్ర, తెలంగాణ ఉద్యమంపై కేసు స్టడీ’ అనే అంశంపై తాను సమర్పించిన పరిశోధనాత్మక అధ్యయనానికి ఆయనకు ఈ డాక్టరేట్ ను బహూకరించారు.ఉవ్వెత్తున సాగిన తెలంగాణ ఉద్యమంలో యువత అగ్రభాగం లో నిలిచారు.దీనికి ఉద్యమ ఆకాంక్షను విస్తృతంగా జనబహు ళ్యంలోకి తీసుకెళ్లడంలో, సామాన్యుల భావ వ్యక్తీకరణకు సోషల్ మీడియా దోహదపడింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ విధంగా సోషల్ మీడియా కీలక భూమిక పోషించింది అని వివరిస్తూ శ్రీకాంత్ తన పరిశోధన పత్రాన్ని సమర్పించారు.ఇప్పటి వరకు సింగరేణి ఉద్యోగుల్లో పీ హెచ్ డీ సాధించిన వారు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు.ఈ నేపథ్యంలో ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నత చదువుల పట్ల జిజ్ఞాసతో శ్రీకాంత్ పీ హెచ్ డీ సాధించటంపై ఛైర్మన్ ఎండీ ఎన్. బలరామ్ తన అభినందనలు తెలిపారు. వృత్తి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నత విద్యార్హతలు సాధించాలనుకునే వారికి ప్రేరణను ఇస్తుందన్నారు.తన పరిశోధన అనుభవంతో సింగరేణి ప్రజా సంబంధాల విభాగానికి కూడా మంచి పేరు తీసుకు వస్తారని ఆకాంక్షించారు.అలాగే ఈడీ(కోల్ మూమెంట్) ఎస్.డి.ఎం సుభాని, జీఎం (మార్కెటింగ్) టి.శ్రీనివాస్, సింగరేణి భవన్ అధికారులు, ఉద్యోగులు తమ అభినందనలు తెలిపారు.