ముద్ర కూకట్పల్లి :
హైదరాబాద్ నగరం మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కొనియాడారు. వివేకానంద నగర్ లో ప్రేకాస మినీ హాల్లో ‘మేము సైతం’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక కరపత్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ

కాకతీయుల కాలంలో ‘గొల్లకొండ’గా పిలవబడిన నేటి గోల్కొండ, కుతుబ్ షాహీలు, నిజాంల పాలనలో అంతర్జాతీయ గుర్తింపు పొందిందని తెలిపారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల చారిత్రక కట్టడాలు, రాజకీయ, సాంస్కృతిక విశేషాలను భావితరాలకు అందించేందుకు ‘మేము సైతం’ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.
వివిధ రంగాల్లో రాణిస్తూ మాతృభూమి రుణం తీర్చుకుంటున్న ప్రముఖులు, అధికారులు, ప్రజాప్రతినిధుల జీవిత విశేషాలను ఈ పుస్తకంలో పొందుపరచడం ద్వారా నేటి తరానికి స్ఫూర్తి లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు బి.వెంకటేశ్వర్లు, ప్రతాప్, డాక్టర్ మహమ్మద్ రఫీ, ఉప్పు సత్యనారాయణ, ఎర్ర యాకన్న, పిసాటి జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.