- ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం.
కుషాయిగూడ , ముద్ర విలేఖరి: ఇటీవల నియమించిన కుషాయిగూడలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు రద్దయ్యింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈనెల 11వ తేదీన కుషాయిగూడ లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు 13 మంది సభ్యులను నియమస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అదే రోజు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈవో వీరేశం ఎన్నికైన ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులతో ప్రమాణం చేయించి బాధ్యతలను అప్పగించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ట్రస్ట్ బోర్డు సభ్యుల ఉత్తర్వులపై వెంకటేశ్వర స్వామి ఆలయ ఫౌండర్ ట్రస్ట్ సభ్యుడు, ఆలయ చైర్మన్ వుప్పల యాదగిరి రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వం జారీచేసిన పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యుల ఉత్తర్వులను రద్దు చేసింది. అలాగే తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ విషయమై ఆలయ ఈవో వీరేశం ను వివరణ కోరగా… ఆలయ ట్రస్ట్ బోర్డ్ కమిటీ రద్దయినట్లు తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదన్నారు. ఇక కమిటీ నియామకంకు సంబంధించిన అంశం తన పరిధిలో లేదని, రాష్ట్ర ప్రభుత్వంకు సంబంధించిన అంశమని ఆయన తెలిపారు. దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలను సారం తాను బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.