ముద్ర, తాండూర్ :
తాండూర్ పట్టణంలోని ఇందిరా నగర్ లో వెలసిన ఏకైక శ్రీ రామ మందిర పునర్నిర్మాణ మహోత్సవం బుధవారం కన్నుల పండువగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ, లక్ష్మణ మరియు హనుమంతుని విగ్రహాల ప్రాణ ప్రతిష్టతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా, అత్యంత వైభవంగా నిర్వహించారు.

గత కొన్ని రోజులుగా ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతుండగా, బుధవారం నాటి ప్రధాన ఘట్టంతో కాలనీ అంతా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ విగ్రహాలను ప్రతిష్టించారు.

ఈ వేడుకకు ఇందిరా నగర్ కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి మహిళలు, యువకులు మరియు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమోగిపోయాయి. యువత ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించగా, మహిళలు భజనలు, కోలాటాలతో సందడి చేశారు. అందరి సమిష్టి కృషితో ఈ కార్యక్రమం ఘనంగా విజయవంతమైందని ఆలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.