Take a fresh look at your lifestyle.

27, 28 తేదీల్లో ‘హైబ్రిడ్’ పద్ధతిలో టీడీపీ మహానాడు – ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

 

ముద్ర, హైదరాబాద్ :

మంగళగిరి వేదికగా ఈనెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక ‘మహానాడు’ కార్యక్రమాన్ని హైబ్రిడ్ (వర్చువల్ & ఫిజికల్) విధానంలో నిర్వహించనున్నట్లు టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు.

పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 37 మహానాడులు విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేసిన సోమిరెడ్డి.. తొలుత ఈసారి మహానాడును నెల్లూరులో భారీ స్థాయిలో నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. అయితే అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన పొదుపు అవసరం, ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో భారీగా వాహనాల వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో మహానాడును మంగళగిరిలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలిపారు.

నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇదేనని, ఆయన నేతృత్వంలో కార్యక్రమం అట్టహాసంగా సాగనుందని చెప్పారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు, జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొంటారని వెల్లడించారు.

కోవిడ్ సమయంలో అమలు చేసిన విధానాన్ని మళ్లీ అనుసరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ల వారీగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి మండలాన్ని రెండు లేదా మూడు క్లస్టర్లుగా విభజించి, ఒక్కో క్లస్టర్‌లో సుమారు 300 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి మంగళగిరి కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంలోనే 12 క్లస్టర్లు ఏర్పాటు చేసి దాదాపు 4 వేల మందికి భోజన వసతులు కల్పించనున్నట్లు వివరించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని సోమిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్, నారా లోకేష్ కృషి, కేంద్ర ప్రభుత్వ మద్దతు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.

అదే సమయంలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన సోమిరెడ్డి.. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకునేలా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర అభివృద్ధిని కోరుకోవాల్సిన బాధ్యత ఉందని, కానీ వైసీపీ మాత్రం విధ్వంసక రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

ఈ మహానాడులో మొత్తం 19 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన 13 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించిన 4 తీర్మానాలు, అండమాన్ అలయన్స్‌పై ఒక తీర్మానం, రాజకీయ అంశాలపై మరో తీర్మానం ఉంటాయని చెప్పారు. తీర్మానాల కమిటీ సభ్యులు రెండు రోజుల పాటు చర్చించి వీటిని ఖరారు చేశారని, పొలిట్‌బ్యూరో ఆమోదం అనంతరం మహానాడులో అధికారికంగా ప్రవేశపెడతామని సోమిరెడ్డి స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.