తెలంగాణలో బీజేపీకి దిక్కులేదు
ఎన్నికల ప్రచారం కోసం పవన్ కల్యాణ్ ముందు మోకరిల్లే పరిస్థితి వచ్చింది
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ముద్ర, నిజామాబాద్ :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తర్వాతే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రావాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ గురించి పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఈ ప్రాంత ప్రజలు మర్చిపోలేదన్నారు. ప్రజలు పవన్ కల్యాణ్ ను ఒక సినిమా నటుడుగా మాత్రమే ఆదరిస్తారన్న ఆయన తాను కూడా చిరంజీవి అభిమానిని అని అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ దగ్గర మోకరిల్లాల్సిన పరిస్థితి బీజేపీకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అసలు తెలంగాణలో బీజేపీకి దిక్కులేదని చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు అయినా నాయకులు అయినా కాళ్లకు బలుపు కట్టుకుని తిరిగితే ఓట్లు పడే పరిస్థితి లేదన్నారు. అందుకే పవన్ వద్దకు వెళ్లి మోకరిల్లారని అన్నారు.