ముద్ర గండిపేట్ : మణికొండ మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రేటర్ అల్కాపూరీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (గర్వ) కృషి చేయనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అసోసియేషన్ లో చేరడానికి ఆసక్తి ఉన్న వారికి స్వాగతం పలికారు. ప్రతి కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి సత్వరమే పరిష్కరించడానికి అసోసియేషన్ కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఉగాది పండుగ రోజు శుభ సూచకంగా 750 మందితో గర్వా అసోసియేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రారంభం రోజే 750 మంది సభ్యులు చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా మణికొండ మునిసిపాలిటీలో ఆస్తి పన్ను వసూలు చేస్తున్నట్లు తెలిపారు. వేసవి ప్రారంభం దశలోనే అల్కాపురి కాలనీలో తీవ్ర నీటిఎద్దడి మొదలైనట్లు వెల్లడించారు. చుట్టుప్రక్కల భూ గర్బజలాలు తోడేస్తున్నారు. దీంతో కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయన్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం జలమండలి ఎండి అశోక్ రెడ్డిని కలుస్తామని తెలియజేశారు. గర్వను నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించినట్లు వివరించారు. ఇక్కడి ప్రజలు దోమలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక చిన్న చెరువులో గుర్రపుడెక్క బాగా పెరిగిందని, అధికారులు వెంటనే దానిని తొలగిస్తే దోమల బెడద తప్పుతుందన్నారు. ఇక్కడ ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా పెరిగిందని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గర్వ ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్ తణుకురి, గర్వ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్లు నివరతి సురేష్, ఎంఆర్ఎన్ దిలీప్, కిరణ్ కుమార్, పురుషోత్తంరావు, శ్రీధర్, శ్రావణ్ కుమార్, చిరాన్ జిత్ గోష్, అనుపమ, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.