గత పాలకులు పదేళ్లు ప్రజలను పట్టించుకోలేదు
ఎన్నికలు రాగానే జనం మధ్యలో తిరుగుతున్నారు
సొంతింటి కలను నెరవేరుస్తాం
ఖమ్మం సభలో మంత్రి పొంగులేటి
ముద్ర, ఖమ్మం :
అధికారంలో ఉన్న పదేళ్లు నిరుపేదల ఇళ్ల స్థలాల గురించి పట్టించుకోకుండా అరాచకంగా వ్యవహరించిన వారు… నేడు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం ఆరాటపడుతున్నారని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 7, 8, 9, 12, 13 వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షోలో ఆయన పాల్గొని విపక్షాల తీరు పై నిప్పులు చెరిగారు. గత పాలకులు పేదల సొంతింటి కలను నిర్లక్ష్యం చేశారన్నారు, ఆనాడు అర్హులైన వారికి స్థలాలు ఇవ్వకుండా వంచించారని ఆయన మండిపడ్డారు. ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని తానేనన్న మంత్రి…, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అర్హులైన ప్రతి నిరుపేదకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, వాటిలో ఇందిరమ్మ ఇళ్లు కూడా కట్టించి ఇచ్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఏప్రిల్ నుంచి వరుస విడతల్లో ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు విశ్రమించనని హామీ ఇచ్చారు.
సంక్షేమ పథకాలతో పేదల చెంతకు
రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం వంటి పథకాలతో పేదలకు అండగా నిలుస్తోందని మంత్రి వివరించారు. ఏదులాపురం మున్సిపాలిటీని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని, వార్డుల్లో పెండింగ్లో ఉన్న రోడ్లు, డ్రైన్ల పనులను వేసవి లోపే పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. తనను అసెంబ్లీ ఎన్నికల్లో దీవించినట్టే, ఏదులాపురం మున్సిపాలిటీ బరిలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.